● ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు
గద్వాల: బీసీ హక్కుల సాధన కోసం ప్రతిఒక్కరు కలిసివచ్చి ఐక్యపోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతురావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో బీసీ సింహగర్జన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీసీ సమాజాన్ని చైతన్యపర్చి హక్కుల సాధన దిశగా ముందుకు నడిపించే ఉద్యమానికి ఈ వేదికగా నిలిచిందన్నారు. దేశంలో బీసీల జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలు అందాలనే డిమాండ్ను ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ సహా బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. చైతన్యమే బీసీల బలం అని, బీసీ సమాజం హక్కుల గురించి ప్రశ్నించే స్థాయి నుంచి వాటి సాధన కోసం సంఘటితంగా కృషి చేసే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మహిళలకు ఆర్థిక సాధికారత బీసీ వృత్తులకు ప్రోత్సాహం జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిథ్యం ఇవన్నీ సాధించాలంటే బీసీలలో ఐక్యత అవసరమన్నారు. అనంతరం పాతబస్టాండు నుంచి కృష్ణవేణి చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పూలే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఓబీసీ రుద్రసంతోష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్గౌడ్, మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్, నాయకులు రాజేంద్రప్రసాద్యాదవ్, గట్టు తిమ్మప్ప, మల్లయ్య, ధనలక్ష్మి, జయలక్ష్మి, శ్రీనివాస్, శంకర్, హనుమంతు, శ్రీనివాసులు, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


