అటెండర్లు ఊడ్చాలి, తూడ్చాలి
● జీఓను అతిక్రమించి
శానిటేషన్ సిబ్బందికి వేతనాల్లో కోత
● మొత్తం 32మంది పనిచేస్తుండగా
వారికి 16మందికి వేతనం
● ఒక్కవేతనంతో ఇద్దరు పంచుకోని పనిచేయాలి సూచన
● ఇష్టం లేకపోతే మానివేయాలని
ఆదేశాలు, వారిస్థానంలో
అటెండర్కు క్లీనింగ్ పనులు
● లా, ఇంజినీరింగ్లో కళాశాలలో
భర్తీ చేయని నాన్టీచింగ్ సిబ్బంది
● 100పోస్టుల భర్తీకి అవకాశమున్నా.. పట్టించుకోని యూనివర్సిటీ పెద్దలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ వివాదాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వ ఆదేశాలు, జీవోలను బేకాతరు చేస్తూ అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించడం.. అక్కడే ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బందికి శాపంగా మారింది. యూ నివర్సిటీలో పనిచేస్తున్న శానిటేషన్ అండ్ హౌస్ కీపింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతా 10, 12 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో నానా చాకిరి చేస్తూ కాలం వెళ్లదీస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో కేవలం రూ.2, 3వేలు ఇచ్చినా పనిచేశారు. ఇప్పుడు నిబంధనల ప్రకారం వేతనం పెరిగే క్రమంలో అధికారులు ఒక్క వేతనంలో ఇద్దరు పని చేయాలని, ఐఎంఎఫ్ పోర్టల్లో వివరాలు తీసుకోవడం లేదని కొర్రీలు పెట్ట డం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. వీటితోపాటు నాన్ టీచింగ్ సిబ్బందిని చిన్నచిన్న పీజీ సెంటర్లకు బదిలీ చేయడం, చిన్నచిన్న విషయాలకు విధులకు రావద్దని అధికారులు కక్షపూరితంగా వ్యవహరించడంపై ఆరోపణలు వస్తున్నాయి.
జీఓ ఎం చెబుతుంది
ప్రభుత్వం యూనివర్సిటీలో వివి ధ కేటగిరీల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో విలీనం చేస్తూ మొదటి సారి 2025 నవంబర్ 15న జీఓ నెంబర్ 1626 ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 350మంది నాన్ టీచింగ్ సిబ్బంది వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నట్లు సూచించింది. అందులో శానిటేషన్ అండ్ హౌస్ కీపింగ్ సిబ్బంది ప్రస్తుతం పనిచేస్తున్న 32 మందిని చూపిస్తూ ఒక్కొక్కరికి వేతనం రూ.15, 600 ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మిగ తా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో కలిపి వారికి జీఓ ప్రకారం వేతనాలు ఇస్తున్నా రు. కానీ వీరిని మాత్రం ఔట్ సోర్సింగ్లో ఇప్పటికీ కలపలేదు. జీఓ ప్రకా రం వేతనాలు ఇవ్వలేదు. దీంతో వారికి కేవలం రూ.7600 మాత్రమే చెల్లిస్తున్నారు. వీరితోపాటు గార్డెనింగ్ 10పోస్టులు ఉండగా పనిచేస్తున్న వారిని కూడా విధులకు రావద్దని సూచించినట్లు తెలుస్తుంది. ఏళ్లుగా పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని 45ఏళ్లు దాటిన వారిని తొలగిస్తున్నట్లు సూచించినట్లు సమాచారం.
నిబంధనలకు పాతర
ఇటీవల ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి టెండర్ వచ్చిన క్రమంలో వారికి వేతనాలను చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. అయితే 32మంది సిబ్బందికిలో కేవలం 16మందికి మాత్రమే వేతనం నేరుగా రూ.15600 ఇచ్చేందుకు అవకాశం ఉందని, మిగతా వారికి అవకాశం లేదని, ఒక్కరికి వేతనం ఇస్తే దాన్ని ఇద్దరు పంచుకోవాలని, అలా అయితే పనిచేయాలని లేదంటే వెళ్లిపోవాలని అధికారులు హుకూం జారీ చేసినట్లు తెలుస్తుంది. గతంలో స్క్వాయర్ ఫీట్ క్లీనింగ్ ఆధారం వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం ఒక వ్యక్తికి ఆధారంగా వేతనాలు ఇస్తుంది. ఇలా ఒక్క వేతనాన్ని ఇద్దరు పంచుకుంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి ఒక్కరికి వర్తిస్తుందని, ప్రభుత్వం సూచించిన వేతనాన్ని పట్టించుకోకుండా అధికారులు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని సిబ్బంది వాపోతున్నారు. వీరిని తొలగిస్తే సంబంధిత డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అటెండర్లకు క్లీనింగ్ పనులు అప్పగించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కొత్త పోస్టులపై పట్టింపేంది?
లా, ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేసిన ప్రభుత్వం పోస్టులను కూడా అదనంగా జీఓ 1626 లో కేటాయించింది. మొత్తం 350మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు సూచించినా ప్రస్తుతం పని చేస్తుంది కేవలం 250మంది మాత్రమే. ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు 13, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 29, ఆఫీస్ సాబార్డినేటర్లు 45మంది, సెక్యూరీటీ గార్డులు 90మంది ఉండగా.. ఇందులో సగం మంది కూడా పనిచేయడంలేదు. వీటితోపాటు అనేక పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులకు అవకాశం ఉన్నా.. కొత్త కళాశాలలు ఇతర కార్యాలయాల్లో పాతసిబ్బందితోనే నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొంది.
గతంలో సిబ్బందికి స్క్వాయర్ ఫీట్ ఆధారంగా వేతనం వచ్చేది. ఇప్పుడు వ్యక్తి ఆధారంగా వేతనం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఐఎంఎఫ్ పోర్టల్లో 16మందివి మాత్రమే తీసుకుంటున్నాయి. వారికి వచ్చే వేతనంలో 32మంది పనిచేయాలి. ఎక్కువ మొత్తంలో వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వీరు చేయకపోతే అటెండర్లు, ఊడ్చి, తూడ్చే పనులు చేయాల్సి ఉంది.
– రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ


