● ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. మెట్టుగడ్డ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దాదాపు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, 4 లక్షల మందికిపైగా విద్యార్థులకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందలేదని ఆరోపించారు. బకాయిలతో కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్, జిల్లా కన్వీనర్ సౌమ్య, శాంతన్, నరేష్, కార్తిక్, నవీన్, మణి, బండి, గణేష్, శివసాయి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.


