అక్టోబర్ 19న తుది జాబితా
● సర్ ముసాయిదా జాబితా విడుదల
● జిల్లాలో 1,03,086
ఓట్లు తగ్గినట్లు వెల్లడి
● అభ్యంతరాల స్వీకరణకు
నెల రోజుల గడువు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 6,29,402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,13,275 మంది పురుషులు, 3,16,108 మంది మహిళలు, 19 మంది ఇతరులు కాగా.. 785 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గత జాబితాతో పోలిస్తే 1,03,086 ఓట్లు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లు తదితరాలను తొలగించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి ఇంటింటి ఓటరు పరిశీలన చేపట్టారు. సోమవారం నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాలను ప్రకటించారు. జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబరు 16 వరకు స్వీకరించి, సెప్టెంబరు 17 నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాలను అక్టోబరు 10లోగా పరిష్కరించి, అక్టోబరు 19న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.
నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితా ఇలా..
నియోజకవర్గం పోలింగ్ పురుషులు మహిళలు ఇతరులు సర్వీసు
స్టేషన్లు
మహబూబ్నగర్ 279 1,06,054 1,07,524 10 316
జడ్చర్ల 280 99,485 99,862 7 265
దేవరకద్ర 303 1,07,736 1,08,722 2 204
ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా స్వీకరిస్తాం. పరిశీలన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తాం. ముసాయిదా ప్రకారం జిల్లాలో 6,29,402 మంది ఓటర్లు ఉన్నారు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్


