● బీజేపీ పాలనలో కుల వివక్ష
కొనసాగుతోంది
● నాగర్కర్నూల్ ఎంపీ
డాక్టర్ మల్లురవి
స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. హల్ద్వాని ఘటనకు నిరసనగా సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పసులరాజు ఆధ్వర్యంలో ర్యాలీ, సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశాన్ని బీజేపీ మద్దతుదారులు వచ్చి పరిశుభ్రం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఖర్గే పట్ల జరిగిన వివక్షను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా దేశంలో ఇంకా కులవివక్ష కొనసాగుతుండటం బీజేపీ పాలనలో జరిగిన ఈ సంఘటన ఒక నిదర్శమని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ హల్ద్వాని ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, కార్పొరేటర్ ప్రవీణ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పసుల రాజు, పట్టణ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు వినయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.


