జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మద్యం, పొగాకు, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ వ్యసన ముక్త్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలనే లక్ష్యంతో ఆగస్టు 6 నుంచి 20 వరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారీల ప్రతినిధులు తెలిపారు. మద్యం, పొగాకుతో పాటు మొబైల్, స్క్రీన్ వినియోగం, ప్రతికూల ఆలోచనలు, పనులను వాయిదా వేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
సెన్సస్ వివరాలు 20లోగా అందించాలి
సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టేజ్–1 విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. తదుపరి దశలో జిల్లా సెన్సస్ హ్యాండ్బుక్ కోసం 31 సంబంధిత శాఖలు తమ పరిధిలోని వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు అందించాలని ఆదేశించారు. సెన్సస్ రికార్డు లు, ఫైళ్లను భద్రంగా ఉంచాలని, ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, ట్రెయినీ కలెక్టర్ శివాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా ప్రణాళిక శాఖ ఇన్చార్జి అధికారి బి.నర్సింహులు పాల్గొన్నారు.


