స్టేషన్ మహబూబ్నగర్: మిలాదున్నబీ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 26న జిల్లా కేంద్రంలో మిలాద్ జులూస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మజ్లిస్ అహ్లె సున్నత్వల్ జమాత్ మిలాద్ జులూస్ జల్సా కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసర్ నమాజ్ అనంతరం సాయంత్రం మక్కామసీద్ నుంచి జులూస్ ప్రారంభమై క్లాక్టవర్, మున్సిపల్ కార్యాలయం, అశోక్టాకీస్, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ మీదుగా షాసాబ్గుట్ట దర్గా ఆవరణకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం దర్గా ఆవరణలో ధార్మిక సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో కమిటీ చీఫ్ ప్యాట్రన్ సయ్యద్ అబ్దుల్ రజాక్షా ఖాద్రీ, అధ్యక్షుడు మజహర్ హుస్సేన్ షహీద్, కార్యదర్శి ఖాజ ఫయాజుద్దీన్ అన్వర్పాషా, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


