పాలమూరు: సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు భవిష్యత్ను మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోందని, ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు వందసార్లు ఆలోచించాలని సూచించారు. ఆడంబరాలకు వెళ్లి అప్పులు చేయడం కంటే ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని మధ్య తరగతి కుటుంబాలకు సూచించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీస్ కమాండర్ నుంచి గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఉమ్మడి పాలమూరు ప్రజలు ఆరోగ్యం కోసం ఏటా ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం గంట సమయాన్ని వ్యక్తిగత ఆరోగ్యానికి కేటాయించాలి. అనారోగ్యాల బారిన పడిన తర్వాత చికిత్స కోసం ఖర్చు చేయడం కంటే ముందుగానే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మేలు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ఫోన్ ద్వారా అరచేతిలోనే విస్తృత సమాచారం అందుబాటులోకి వచ్చింది. దానిని అనవసరమైన రీల్స్, వినోదం కోసం కాకుండా చదువు, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు వారంలో కొంత సమయాన్ని విశ్రాంతి, వినోదానికి కేటాయిస్తున్నారని, తెలంగాణలోనూ నెలలో కనీసం రెండు, మూడు రోజులు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు కేటాయించుకోవాలి. రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రజలు సందర్శించడం ద్వారా స్థానిక పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది.
సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.65 కోట్ల మంది మహిళా ప్రయాణికులకు ప్రయోజనం కలిగింది. దీంతో రూ.176 కోట్ల మేర లబ్ధి చేకూరింది. 1,27,056 మంది అర్హులకు 4.13 లక్షల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయగా, ప్రభుత్వం రూ.11.03 కోట్ల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే 1,36,738 కుటుంబాలకు ఇప్పటి వరకు జీరో బిల్లులు జారీ చేసింది.
● మిషన్ భగీరథ కింద రూ.284 కోట్లతో 775 ట్యాంకులు, 1,697 కిలోమీటర్ల పైప్లైన్ పనులు మంజూరయ్యాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్లో భూగర్భ డ్రెయినేజీ పథకానికి రూ.603 కోట్లు విడుదలయ్యాయి.టీయూఎఫ్ఐడీసీ పథకం కింద రూ.37.87 కోట్లతో ఎనిమిది రకాల ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. నీటి సరఫరా మెరుగుదలకు రూ.220.94 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు వచ్చాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు అవుతున్నా.. సమాజంలో సామాజిక రుగ్మతలు
కొనసాగుతుండటం బాధాకరం. వాటిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ప్రభాత భేరి’
కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
సారించాలి. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు
నిరంతరం పర్యవేక్షణ ఉంచాలి.
– జూపల్లి కృష్ణారావు, మంత్రి
జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. కలెక్టర్ ఖుష్బూగుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్నాయక్, ఎస్పీ జానకి, నగర మేయర్ మమత, అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ
సంక్షేమం.. అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్ర ప్రభుత్వం
ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం.. ఆడంబరాలకు దూరంగా ఉండాలి
ఆరోగ్యం, విద్య, పర్యాటకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
80వ స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు


