79 ఏళ్లు పూర్తయినా స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న వ్యత్యాసాలు
● స్వేచ్ఛ–సమానత్వం అందడం లేదన్న జనం
● అవినీతి కూడా ప్రధాన సమస్య
● చట్టసభలు, అధికార యంత్రాంగంలో మార్పు రావాలి
● ‘సాక్షి’ సర్వేలో ప్రజల అభిప్రాయాలు
పల్లెలు మరింత అభివృద్ధి చెందాలి..
ఆగస్టు 15 వస్తే ఇప్పటికీ పండగ గుర్తుకొస్తుంది. దసరా, దీపావళి మాదిరిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకునేవాళ్లం. ఆ రోజు ఊరంతా ఒకచోట చేరి జాతీయ జెండా ఎగురవేసి, మిఠాయిలు పంచుకునేవాళ్లం. అనంతరం సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలపై చర్చించి, అవసరమైన తీర్మానాలు చేసుకునేవాళ్లం. ఇన్నేళ్ల స్వాతంత్య్రంలో గతంతో పోలిస్తే ప్రజల్లో స్వార్థం పెరిగింది. గతంలో ‘మన ఊరు.. మన ప్రాంతం’ అనే భావన ఉండేది. ఇప్పుడు ‘నాకేమిస్తారు?’ అనే ధోరణి కనిపించడం బాధ కలిగిస్తోంది. 25 ఏళ్లుగా దేశంలో అభివృద్ధి వేగం పుంజుకుంది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగ్గానే ఉన్నా.. పల్లెలు ఇంకా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. – రంగారావు, తెలంగాణ పోరాట యోధుడు, మాజీ జెడ్పీటీసీ


