● రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వానాకాలం సీజన్ 2026–27లో వరి ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి ప్రొక్యూర్మెంట్ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత మూడు సీజన్లలో కొనుగోలు లక్ష్యాలు, పురోగతితో పాటు ప్రస్తుత పంట సాగు, క్రాప్ బుకింగ్ వివరాల ఆధారంగా ఈ సీజన్లో ఆశించిన దిగుబడిని అంచనా వేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం కొలిచే పరికరాలు, టార్పాలిన్లు, ధాన్యం శుభ్రపరిచే పరికరాలు తదితర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వారీగా ధాన్యం కేటాయింపు, మిల్లింగ్ ప్రక్రియను సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి అవసరమైన బియ్యం సరఫరా చేయాలని సూచించారు. అనంతరం పీడీఎస్ ద్వారా మూడు నెలలకు అవసరమైన బియ్యం సరఫరా, పంపిణీపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన బియ్యం నిల్వలను త్వరగా చౌకధర దుకాణాలకు తరలించి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి కృష్ణ, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ రవినాయక్, డీఆర్డీఏ ఏపీడీ రేణుక, డీటీ రాజీవ్రెడ్డి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


