దేవరకద్ర రూరల్: రూ.5లక్షల వరకు లోన్ మంజూరు చేస్తామంటూ ఓ యువకుడిని నమ్మించిన సైబర్ మోసగాళ్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నాలుగు విడుతల్లో రూ.62వేలు బదిలీ చేయించుకున్నారు. చివరకు బాధితుడు అనుమానంతో నిలదీయడంతో ఫోన్ కట్ చేసి, స్విచ్చాఫ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని గద్దెగూడెంకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఆన్లైన్లో తన స్నేహితుడికి రూ.2లక్షల వరకు లోన్ ఇప్పించాడు. దీంతో తానుకూడా లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని నెంబర్ నుంచి అతడికి ఫోన్ వచ్చింది. రూ.5లక్షల లోన్ మంజూరవుతుందని, అందుకు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు.వారి మాటలు నమ్మిన బాధితుడు నాలు గు విడుతల్లో మొత్తం రూ.62వేలను బదిలీ చేశాడు. అనంతరం లోన్ మంజూరు కాకపోవడంతో ఇలాంటి ప్రక్రియ ఏదీ లేదని ప్రశ్నిస్తూ.. నిలదీయగా అవతలి వ్యక్తులు ఫోన్ కట్ చేశా రు. తిరిగి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
నాలుగు ఇసుక
టిప్పర్లు పట్టివేత
మక్తల్: అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో మక్తల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. టీజీ38టీ–1719, టీఎస్12టీ–3441, టీఎస్08 యుఎప్2734, టీఎస్38 టీ 2007 భారత్ బెంజ్ల నుంచి సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఇసుకను నారాయణపేట జిల్లాకేంద్రానికి అక్రమంగా తరలిస్తుండగా.. మక్తల్ శివారులోని కాటన్మిల్ సమీపంలో టాస్క్ఫోర్సు బృందం నాలుగు ఇసుక టిప్పర్లను పట్టుకొని పోలీసుల కు అప్పగించారు. పోలీసులు ఇదేనెలలో వారంరోజుల్లో 9ఇసుక టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇసుకను అనుమతి లేకుండా మాగనూర్ వాగునుంచి తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


