మహబూబ్ నగర్ న్యూటౌన్: కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని సీఐటీయూ, టీయూసీఐ నాయకులు హెచ్చరించారు. సోమవారం జిల్లాకేంద్రంలో మున్సిపల్టౌన్ హాల్ సభ నిర్వహించుకొని ర్యాలీగా గడియారం చౌరస్తా, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా చేరుకొని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, టీయూసీఐరాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ, మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోపోతే దేశంలో మరో క్విట్ ఇండియా ఉద్యమము చేపడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం లక్షలాది మందితో పెద్ద ఎత్తున జరిగిందని, మోదీ ప్రభుత్వ విధానాలను వెనక్కి తీసుకోకుంటే కార్మికులు, కర్షకులు వ్యవసాయ కూలీలు, ప్రజలు ప్రజాతంత్ర వాదులతో బీజేపీ ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సన్నతమవుతున్నామని వారు హెచ్చరించారు. అనంతరం పలువురు జిల్లా నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలని, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, విత్తన సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మునిసిపల్ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని, వీవోఏల మధ్యాహ్నం భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును ఎత్తివేయాలని ఆలోచనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వెనక్కి తీసుకొని ప్రజా ఉపయోగపనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా ప్రజాసంఘాల నాయకులు రాములు, సీహెచ్ రామ్రామచంద్రర్, కిల్లే గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, వెంకటేష్, సాంబశివుడు, పి.సురేష్, ఎం.రామ్మోహన్, కడియాల మోహన్, దీప్లానాయక్, రాజ్కుమార్, చంద్రకాంత్, విజయ్బాబు, బుచ్చన్న, బాలు, చెన్నయ్య, ప్రశాంత్, నందు, హనుమంతు, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.


