అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆషాఢమాసం చివరి దశకు చేరడం, వరుస సెలువులు రావడంతో చుట్టుపక్కల గ్రామాలతోపాటు సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తరలి రావడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులు అమ్మవారి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆలయంలో అర్చనలు, అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన, అర్చన పూజలు నిర్వహించారు. భక్తులు ఆర్టీసీ బస్సులు సరిగ్గా లేకపోవడంతో ప్రైవేటు వాహనాల ద్వారా క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులు సమయానికి లేకపోవడంతో భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లోనే వెళ్లాల్సి వచ్చింది. క్షేత్రంలోని ప్రధాన రోడ్డుపై వాహనాలు అధికంగా రావడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు.


