స్టేషన్ మహబూబ్నగర్: సాహితీ రంగంలో తెలంగాణ సాహితీ దిగ్గజం పాకాల యశోదారెడ్డి తనదైన ముద్రవేశారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి అన్నారు. పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు సంచాలకులుగా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, సహ సంచాలకులుగా ప్రధాన కార్యదర్శి శాంతారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ పాకాల యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలికమంతా తెలంగాణ, బిజినేపల్లి ప్రాంతానికి చెందినదే అన్నారు. యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ సేవలను కొనియాడారు. ఆచార్య చందోజీరావు మాట్లాడుతూ యశోదారెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు వర్తమాన పరిశోధకులుగా, కథా రచయితలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభ సదస్సుకు రావూరి వనజ సభాధ్యక్షత వహించగా.. సదస్సులో పలువురు పరిశోధకులు పత్రసమర్పణ చేశారు. సమావేశంలోలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద, జి.శాంతారెడ్డి, డాక్టర్ భారతి, ప్రముఖ అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, జయలక్ష్మమ్మ, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, గన్నోజు శ్రీనివాసాచారి, కె.వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


