గతంలో వేసవిలో బోర్లలో నీరు అడుగంటినా, వర్షాకాలం ప్రారంభమైన తర్వాత భూగర్భజలాలు క్రమంగా పైకి వచ్చేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వర్షాకాలం కొనసాగుతున్నా నీటి మట్టం పెరగలేదు. బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో పూర్తిస్థాయిలో సాగు చేయలేకపోతున్నాం. నీరు మధ్యలో అయిపోతుందేమోననే భయంతో సగం భూమిలోనే పంటలు వేశాం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే పంటలతో పాటు రైతుల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. – పాండునాయక్, రైతు, అజిలాపూర్ గ్రామం, నవాబుపేట మండలం
కొంత భూమిలోనే సాగు..
వర్షాకాలం వచ్చిందంటే రైతులకు ధైర్యం వచ్చేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షాలు పడుతున్నా బోర్లలో నీటి మట్టం పెరగడం లేదు. ఒకవైపు విద్యుత్ ఖర్చులు, మరోవైపు నీరు లేక పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళన వెంటాడుతోంది. అందుకే పూర్తిస్థాయిలో సాగు చేయకుండా కొంత భూమినే సాగులోకి తెచ్చాం. భూగర్భజలాలు ఇలాగే తగ్గిపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడం మరింత కష్టమవుతుంది. చెరువులు నింపడం, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలను ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాలి. – రాములు, రైతు గుడిమల్కాపూర్ గ్రామం, హన్వాడ మండలం


