● పోలీసుల అదుపులో ఏడుగురు
● పరారీలో ఇద్దరు
కందనూలు: జిల్లాలో రైతులకు నకిలీ డీఏపీ అంటగట్టిన ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. జూలై 17 ఉదయం 11 గంటల సమయంలో బిజినేపల్లి మండలంలోని మహాదేవునిపేటలో నకిలీ డీఏపీ అమ్ముతున్నట్లు ఏఓ కమల్కుమార్, ఎస్ఐకి సమాచారం అందింది. వారు గ్రామంలోకి వెళ్లి విచారించగా.. ఓ ముఠా ఆరుగురు రైతులకు 110 బస్తాల నకిలీ డీఏపీని అమ్మినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గురించి ఆరా తీయగా.. ఏ1 గా జగదీష్, రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మండలంలోని పెద్ద అంబర్పేట్లో త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి నకిలీ ఎరువులను తయారు చేసి, రైతులకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం ఇతడు పరారీలో ఉన్నారు. ఏ2 గా ఎద్దుల నరేందర్రెడ్డి బిజినేపల్లి మండలంలోని మహదేవునిపేట. ఇతను తన తమ్ముడి భార్య పేరు మీద ఫర్టిలైజర్ షాపు నడుపుతున్నారు. ఏ3 గా దోమ శ్రీకాంత్రెడ్డి (తిమ్మాజిపేట మండలంలోని అమ్మపల్లి), ఏ4 నరేష్, ఏ5 అశోక్రెడ్డి (తిమ్మాజి పేట మండలంలోని కోడుపర్తి), ఏ6 ఉదయ్కుమార్రెడ్డి (బిజినేపల్లి మండలంలోని వెలుగొండ), ఏ7 నవీన్రెడ్డి, ఏ8 ప్రకాష్ (బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్)ను ప్రస్తుతం పోలీసులు రిమాండ్కు పంపించారు. ఏ9 సంతోష్రెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితుడు ఉదయ్కుమార్రెడ్డి 3 నుంచి 4 వేల బస్తాల నకిలీ డీఏపీని మహాదేవునిపేట, వెలుగొండ, మిడ్జిల్ మండలంలోని బోయినపల్లి, తాడూరు, కల్వకుర్తి మండలంలోని లింగసానిపల్లి గ్రామాల్లో సరఫరా చేశాడు. ప్రస్తుతం 450 బస్తాల డీఏపీని రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.


