● రాష్ట్ర వ్యవసాయ, రైతుసంక్షేమ
కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
అమ్రాబాద్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గురువారం అమ్రాబాద్లో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్తోపాటు సభ్యులు కేవీఎన్ రెడ్డి, మర్రి భవానీరెడ్డి, రాములునాయక్, భూమి సునీల్, కలెక్టర్ బదావత్ సంతోష్నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భూభారతి సమస్యలపై రైతులు వివరించిన తీరును పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. ఏసీ గదుల్లో ఉండి చట్టాలు అమలు చేస్తే పూర్తి న్యాయం జరగదని.. ఏజెన్సీ ప్రాంత రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి కమిషన్ సభ్యులతో వచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఆదరబాదరాగా దివాల తీసిన అమెరికాకు చెందిన తెరాస్ కంపెనీతో ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని.. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు భూమి హక్కు పత్రాలు ఉండాలని, ప్రతి రైతు పథకాలకు అర్హులు కావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కమిషన్ ద్వారా భూభారతి తీసుకొచ్చిందని వెల్లడించారు. ఇక్కడ విన్న ప్రతి భూసమస్య, గిరిజనుల భూసమస్యల పరిష్కారానికి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ఉండేవిధంగా కృషిచేస్తూనే చట్టాలలో సంస్కరణలు చేసైనా సన్న, చిన్నకారు రైతులకు న్యాయం జరిగేవిధంగా కమిషన్ కృషిచేస్తుందని తెలిపారు. ఇందుకోసం రైతుల నుంచి అందిన ప్రతి వినతిని పరిశీలించి సీఎంతో మాట్లాడి భూసమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రజాసమస్యల పరిస్కారానికి కృషి
నల్లమల ముద్దుబిడ్డ సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాల్లో అనేక భూసమస్యలు ఉండటంతో కమిషన్ను కోరిన వెంటనే నేరుగా క్షేత్రస్థాయి పరిశీలనకు రావడం సంతోషకరమన్నారు. పదర మండలం ఇప్పలపల్లిలో 200 ఎకరాలు, క్యాంపు రాయవరలంలో 600 ఎకరాల వరకు సాగు చేస్తున్న భూమి ఇటు రెవెన్యూ, అటు అటవీశాఖ పరిధిలో లేకుండా ఉన్నాయని జాయింట్ సర్వే నిర్వహించి సాగుచేస్తున్న రైతులకు న్యాయం చేయాలని కోరా రు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. కమిషన్ ముందుంచిన భూ సమస్యలను పరిశీలించి ప్రత్యేక డ్రైవర్ ద్వారానైనా పరిష్కరిస్తామన్నారు. సదస్సులో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓ యాదగిరి, సర్పంచ్ కోటయ్య, వ్యవసాయ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటయ్య పాల్గొన్నారు.


