నేడు తెలుగువారి తొలి పండుగ
● శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణం
స్టేషన్ మహబూబ్నగర్: తెలుగు పండుగలలో తొలి పండుగ ఉగాది. యుగాల ప్రారంభానికి ఆదిగా నిలిచే వేడుక అయినందున కాలగమనంలో యుగాదే ఉగాదిగా మారిందని చెబుతుంటారు. శ్రీసీతారాముల కల్యాణ వేడుకకు ముందుగా జరిగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఉగాది నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఈ రోజున కొత్త కార్యాలు ప్రారంభిస్తే శుభపద్రంగా ఉంటుందని నమ్మకం. గురువారం జిల్లావ్యాప్తంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు.
పాలమూరులో పండుగ సందడి.
ఉగాది వేడుకల సందడి మహబూబ్నగర్ నగరంలో రెండు రోజుల నుంచే ప్రారంభమైంది. పండుగకు కావాల్సిన మామిడి తోరణాలు, వేపపువ్వు, కొత్త కుండలు, బంతిపూలు, మామిడి కాయలు, కొత్తచింతపండు, కొత్త బెల్లం, తదితర సామగ్రి కొనుగోలు చేయడం కనిపించింది. పాన్చౌరస్తా, క్లాక్టవర్, న్యూబస్టాండ్, తదితర ప్రాంతాల్లో ఉగాది పండుగ సందడి నెలకొంది.
● జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో గురువారం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, బ్రాహ్మణవాడి శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, టీడీగుట్ట, టీచర్స్కాలనీ రామాలయం, సింహగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం, పరిమళగిరి ఆంజనేయస్వామి దేవాలయాలతోపాటు పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేయనున్నారు. ముందుగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితులు పంచాంగ శ్రవణం చేయనున్నారు.


