వనపర్తి రూరల్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలను యావత్ భారతదేశ ప్రజలంతా ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల్లోని సహజ వనరుల దోపిడీకి ఏకంగా యుద్ధాలను ప్రకటిస్తుండటం దుర్మార్గమైన చర్యని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో మిత్ర దేశాలతోనూ శత్రుత్వాలు పెంచుకునేలా వ్యవహరిస్తూ యుద్ధ వాతావరణాన్ని ప్రేరేపిస్తుడటం బాధాకరమన్నారు. వెనెజులా అధ్యక్షుడు మధురో ఆయన భార్య ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి అమెరికా సైన్యం వారి ఇంటిని చుట్టుముట్టి నిర్బంధించారని తెలిపారు. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ను పావుగా వాడుకొని ఇద్దరు కలిసి యుద్ధ ట్యాంకులతో విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమెరికాను ఎదురొడ్డి పోరాడుతున్న ఇరాన్కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాకు లొంగి ఇరాన్పై దాడిని ఖండించడం లేదని విమర్శించారు. యుద్ధాలతో నష్టమే తప్ప మేలు ఉండదని, శాంతి చర్చలే అభివృద్ధికి ఆనవాళ్లు అన్నారు. ఇటీవల దేశం, రాష్ట్రంలో కుల అసమానతలతో కూడిన దాడులు పెరుగుతున్నాయని వాటిని ఖండిస్తున్నామని చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో అగ్రవర్ణాల పెత్తందారులు గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై దాడిచేసి రెండు నెలల పసికందును హత్య చేశారని, రాజకీయ జోక్యం లేకుండా దోషులపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం, పాలకవర్గాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేవారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత సీఎం రేవంత్రెడ్డి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు వెంకటయ్య, బాల్యానాయక్, వెంకట్రాములు, మేకల ఆంజనేయులు, మహబూబ్పాషా, వెంకటేష్, పరమేశ్వరాచారి, కృష్ణయ్య కౌన్సిలర్ గంధం మదన్ తదితర నాయకులు పాల్గొన్నారు.


