ఖిల్లాఘనపురం: పంటల సాగులో అధిక రసాయన ఎరువుల వినియోగం మానవాళి మనుగడకే ప్రమాదకరమని వ్యవసాయ శాస్త్రవేత్త డా. వికిల్ అన్నారు. శుక్రవారం మండలంలోని సోళీపురం రైతువేధికలో వ్యవసాయశాఖ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సహకారంతో పంటల సాగు విధానంపై రైతులకు రెండ్రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య హాజరై పలు సూచనలు చేశారు. పంటల యాజమాన్య పద్ధతిలో భాగంగా వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకే ఎరువులు వినియోగించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నానో యూరియా, నానో డీఏపీ వాడాలని, సేంద్రియ సాగుతో రైతుతో పాటు పండించిన పంట తినే ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుందన్నారు. ఒకేసారి కాకుండా రైతులు మొదట తమ కుటుంబం కోసం కొంత భూమిలో సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరారు. ఇలా చేయడంతో నేల స్వభా వం మారకపోవడంతో పాటు భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోకుండా ఉంటాయ ని చెప్పారు. సేంద్రియ వ్యవసాయంపై శిక్షణనిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఏఈఓ సునీత, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


