షాద్నగర్ రూరల్: హోలీ సందర్భంగా స్నానానికి వెళ్లి చెరువులో గల్లంతైన గురుకుల విద్యార్థి మృతదేహం బుధవారం లభ్యమైంది. మండల పరిధిలోని రాయికల్ శివారు చెరువులో మహాత్మాజ్యోతిరావుపూలే గురుకులానికి చెందిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి మంగళవారం గల్లంతైన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు(19) మంగళవారం హోలీ సంబురాల తర్వాత తోటి విద్యార్థులతో కలిసి సమీపంలోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. ఎంత వెతికినా విద్యార్థి ఆచూకీ తెలియలేదు. మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఏసీ పీ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, ఎంపీఓ జయంత్రెడ్డి బుధవారం ఘట నా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చేపట్టిన గాలింపు చర్యల్లో లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. కుటుంబ పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.7.5 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు, మహత్మా జ్యోతిరావుపూలే గురుకుల సొసైటీలో ఔట్ సోర్సింగ్ ఉదోగ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. వసతిగృహం సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
సహాయక చర్యలను పరిశీలించిన ఏసీపీ, ఆర్డీఓ, తహసీల్దార్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మహబూబ్నగర్ అదనపు కలెక్టర్
మృతుడి కుటుంబానికి
రూ.7.5 లక్షల ఎక్స్గ్రేషియా


