చెంచుల పండుగకు వేళాయె..
ఇవీ కార్యక్రమాలు..
జాతరకు వెళ్లేదిలా..
రేపట్నుంచి భౌరాపూర్
ఉత్సవాలు
అచ్చంపేట: నల్లమలలోని భౌరాపూర్ భ్రమరాంబ ఆలయంలో ఏటా శివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెంచుల పండుగ నిర్వహిస్తోంది. 14 నుంచి 16వ తేదీ వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి సౌకర్యాల కల్పనపై పలు సూచనలు చేశారు. పురాతన ఆలయంలో కొలువుదీరిన భ్రమరాంబిక, మల్లికార్జునస్వామికి మహా శివరాత్రి రోజున శ్రీశైలంలో జరిగే విధంగా ఇక్కడ కూడా కల్యాణం జరిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది.
రహదారి, ఆదరణ లేక కనుమరుగు..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో జరిగే భౌరాపూర్ ఉత్సవాలు ఆదివాసీ చెంచుల సంస్కతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. అప్పట్లో శ్రీశైలానికి భౌరాపూర్ మీదుగా కాకుండా వటువర్లపల్లి, దోమలపెంట మీదుగా రోడ్డు వేశారు. దీంతో పట్టించుకునే వారు లేక ఆదరణ కరువైంది. ఆదివాసి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్ధేశంతో 2016లో అన్ని చెంచుపెంటలు, గ్రామాల్లో ప్రచారం కల్పించారు. దీంతోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెంచు గిరిజనులు గిరిజన సంక్షేమశాఖ మంత్రిని కలిసి ఇక్కడి పరిస్థితి వివరించడంతో నాటి నుంచి ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగ నిర్వహిస్తోంది.
● రెడ్డిరాజులు, చాళక్యులు, ఈక్ష్వాకుల కాలంలో భౌరాపూర్ చెరువు వద్ద భ్రమరాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆలయానికి ఎదురుగా చెరువు కట్టపై వీరభద్రుడు, మూడుకిలోమీటర్ల దూరంలో నైరుతి వైపున వంటి వీరన్న (వీరభద్రుడు) వెలిశారు. దీంతో ఆ ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా మారింది. ఆలయ నిర్మాణం జరగడంతో మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో భౌరాపూర్ జాతర కూడా చెంచుల సాంప్రదాయాలతో వైభవంగా నిర్వహించేవారు. శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు నల్లమల చెంచులు జాతరలో పాల్గొని తమ సాంప్రదాయాలు, సంస్కతిని కొనసాగించేవారు.
భౌరాపూర్ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయం
14న శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు స్వాగతోపన్యాసం.. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి 12 వరకు చెంచుల సంస్కతి ఉట్టిపడేలా సాంస్కతిక కార్యక్రమాలు, చెంచుల ఆట పాట, శివనామస్మరణ, జాగరణ, సాంప్రదాయ నత్యాలు.
15న ఆదివారం ఉదయం 8 నుంచి 9.55 వరకు అల్పాహారం, 10 నుంచి 11 వరకు ముఖ్యఅతిథులకు స్వాగతం, వేదపండితులతో గణపతిపూజ, రుద్రహోమం, అభిషేకం, అంకురార్పణ అనంతరం 11 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునస్వామి కల్యాణం.
16న అమ్మవారు, స్వామివారికి ప్రత్యేక పూజలు, జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. నల్లమల చెంచులతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చెంచులు, ఇతర సామాజిక వర్గాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో వస్తారు.
15న భ్రమరాంబిక, మల్లన్న కల్యాణం
పులకించనున్న అడవి తల్లి
వివిధ జిల్లాల నుంచి చెంచుల రాక
ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు
జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ దగ్గర ఉన్న ఫర్హాబాద్ చౌరస్తా వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన చెక్పోస్టు ప్రధాన రహదారి నుంచి 15 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు శ్రీశైలం నుంచి ఫర్హాబాద్ చౌరస్తా చెక్పోస్టు వద్దకు వచ్చి అటవీ మార్గంలో భౌరాపూర్ చేరుకోవచ్చు. అప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండటంతో ప్రత్యేక అధికారి, కార్యదర్శి, ఆలయ కమిటీ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్లాస్టిక్ వినియోగించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆలయ అలంకరణ, విద్యుద్ధీకరణ, వైద్యసేవలు, 108, ఫైరింజన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తదితర మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అటవీ, పోలీస్శాఖ సమన్వయంతో పర్యవేక్షించనున్నారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు, మార్గమధ్యంలో పెంటల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు కానున్నాయి.
చెంచుల పండుగకు వేళాయె..


