ఆకాశమే హద్దుగా పతంగుల సందడి
స్టేషన్ మహబూబ్నగర్: సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనవాయితీగా వస్తోంది. పిల్లలే కాదు.. యువకులు, పెద్దలు సైతం గాలి పటాలను ఎగురవేసేందుకు పోటీ పడుతుంటారు. ఇతరుల గాలిపటం కంటే మనదే ఎక్కువ ఎత్తులోకి ఎగురవేసే క్రమంలో కేరింతలు కొడుతారు. గాలిపటాల సందడి మార్కెట్లో సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే ప్రారంభమైంది. జిల్లాకేంద్రంలోని ప్రధాన ప్రాంతాలు, వీధుల్లో గాలిపటాలను విక్రయిస్తున్నారు. కేవలం పట్టణాలకు వరకే ఉన్న గాలిపటాల హల్చల్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. చక్కని ఆకృతితో ఆకట్టుకునేలా వివిధ డిజైన్ల పతంగులు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. చిన్నారులను ప్రత్యేకంగా ఆకర్షించేలా ప్రింటెడ్, కార్టూన్ గాలిపటాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.
● గాలిపటాలను ఆకాశంలో ఎగురవేయడం ఒక ఎత్తయితే ఒకదానికి ఒకటి పోటీపడడం మరో ఎత్తు. ఎవరి గాలిపటాలు తెగి పడుతాయోన్న విషయం ఎవరికీ అర్థం కాదు. తెగిపడిన గాలిపటాలను తీసుకోవడానికి చిన్నారులు ఒక్కటే పరుగు తీస్తారు. మహబూబ్నగర్లోని పాన్చౌరస్తా పతంగుల మార్కెట్గా పేరొందింది. హైదరాబాద్లోని చార్మినార్, ధూల్పేట్, లాడ్బజార్ తదితర ప్రాంతాల నుంచి గాలిపటాలు, మాంజాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. రూ.5 నుంచి రూ.500 వరకు పతంగులు అందుబటులో ఉన్నాయి.
ఈ 3 రోజులు మరింత గిరాకీ
మా కుటుంబం 52 ఏళ్ల నుంచి సంక్రాంతి పండుగ దినాల్లో గాలిపటాలను విక్రయిస్తుంది. నాతో పాటు నా సోదరుడు, కుమారులు ఇదే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. నా చిన్నతనంలో పేపర్తో తయారుచేసిన గాలిపటాలను అమ్మేవాళ్లం. ప్రస్తుతం ఎన్నో రకాల గాలిపటాలు వస్తున్నాయి. కులమతాలకతీతంగా చిన్నారులు గాలిపటాలను కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు మరింత గిరాకీ ఉంటుంది.
– అశ్వాక్అలీ పాష, పాన్చౌరస్తా, మహబూబ్నగర్
ఆకాశమే హద్దుగా పతంగుల సందడి


