గ్రామీణ క్రీడలకు జీవం ‘వావివాల’
అట్టహాసంగా జరగనున్న పోటీలు
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు..
ప్రత్యేక యాగాలు, హోమాలు..
ఎర్రవల్లి: ఇటిక్యాల మండలంలోని వావివాల బ్ర హ్మోత్సవాలు గ్రామీణ సంప్రదాయ క్రీడలకు నిలయంగా మారనున్నాయి. ఈ ఉత్సవాలకు అంతరాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై గ్రామీణ క్రీడల్లో సత్తా చాటుతారు. ఈ నెల 12 నుంచి 16 వరకు శివాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో 12న సుప్రభాతసేవ, గణపతిపూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్య మేళన ప్రాఽశనం, యాగశాల ప్రవేశం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, ధ్వజారోహణం, పల్లకీసేవ నిర్వహిస్తారు. 13 న బిందె సేవ, రుద్రాభిషేకం, నవగ్రహ హోమం, బలిహరణ, ఉపనయనసేవలు ఉంటాయి. 14న పంచామృత అభిషేకం, జలక్షీర తర్పణం, నిత్యహోమాలు, రాత్రి రథాంగహోమం, రథోత్సవం కనులపండువగా జరుగుతాయి. 15న సుగంధద్రవ్యాలతో అభిషేకం, లక్ష్మీగణపతి హోమం, నవగ్రహహోమం, రుద్రహోమం, బలిహ రణ, పల్లకీసేవ, తీర్థప్రసాద ఆశీర్వచణం, 16న మూలమంత్ర హననం, దశ దిక్పాలక బలి, మహా పూర్ణాహుతి, రుత్విక్ సన్మానం, తెప్పోత్సవం, స్వామివారి జలక్రీడలు, పల్లకీసేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రతి సంవత్సరం మకర సంక్రమణ పుణ్యకాలం నందు స్వామి వారికి ఉపనయన కార్యక్రమం, రథోత్సవం, తిరునాళ్ల భక్తిశ్రద్ధలతో ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆలయంలో గ్రామస్తులు, దే వాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నర్మదబాణం ప్రతిష్ఠించారు. బాణాసురుడు వింధ్యా పర్వతాల్లో నర్మదానది తీరంలో శంకరుడి గూర్చి ఘోర తపస్సు ఆచరించి నీలకంఠుని దర్శన భాగ్యం పొందాడని, స్వామి యొక్క ఆత్మలింగాలు నర్మదానదిలో దొరికినట్లు, నర్మద నదిలో దొరికిన బాణం సాక్షాత్తు పరమశివుడని ఇక్కడి ప్రజల నమ్మకం.
ఉత్సవాల్లో భాగంగా ఆనందాశ్రమ వ్యవస్థాపకుడు, అశ్వమేథ యాగకర్త అయిన డాక్టర్ పెరిశెపల్లి వెంకట శేషసాయిచే శ్రీ చక్ర ప్రతిష్ఠ, శ్రీయాగం, చండీయాగం, గణపతి హోమం, పాశుపతం మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఐదు రోజుల పాటు జరగనున్న శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు చట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 18 వరకు వివిధ గ్రామీణ సాంప్రదాయ పోటీలను నిర్వహించనున్నారు. 12న అంతరాష్ట్ర భజన పోటీలు, 13న ముగ్గుల పోటీలు, 14న బ్యాండ్ ప్రదర్శన, 15న నాలుగుపళ్ల విభాగం బండలాగుడు పోటీలు, 16న ఆరుపళ్ల విభాగం బండలాగుడు పోటీలు, పొటేళ్ల బల ప్రదర్శన పోటీలు, డ్యాన్స్ పోటీలు, 17న న్యూ కేటగిరి విభాగం బండలాగుడు పోటీలు, జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, 18న సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు, 60 కిలోల చందరాళ్ల ఎత్తే పోటీలు, 90 కిలోల గుబ్బల గుండ్లు ఎత్తే పోటీలు, 120కిలోల దొబ్బడు గుండు ఎత్తే పోటీలు, 140 కిలోల ఇసుక సంచి ఎత్తే పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పోటీదారులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవ పోటీల్లో తమ బల ప్రదర్శన చేస్తారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి శివాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి, విజేతలకు నగదు బహుమతులను కూడా అందజేస్తారు.
నేటి నుంచి శివాంజనేయస్వామి
ఉత్సవాలు
వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్న క్రీడాకారులు, భక్తులు
ఐదు రోజుల పాటు
జరగనున్న వేడుకలు
పోటాపోటీగా పొట్టేళ్ల పందెం,
ఇసుక బస్తా, తోపుడు గుండ్ల పోటీలు
గ్రామీణ క్రీడలకు జీవం ‘వావివాల’


