మహబూబ్నగర్లో క్రికెట్ అకాడమీ
● ఈ నెల చివర్లో ఉత్తరాఖండ్ –
హైదరాబాద్ మహిళల మ్యాచ్
● హెచ్సీఏ జాయింట్ సెక్రెటరీ బస్వరాజ్
● ఉత్సాహంగా టీ–20 లీగ్
రెండో ఫేజ్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్లో త్వరలోనే క్రికెట్ అకాడమీ ప్రారంభిస్తామని హెచ్సీఏ జాయింట్ సెక్రెటరీ బస్వరాజ్ అన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్లో భాగంగా రెండో ఫేజ్ లీగ్ మ్యాచ్లు ఆదివారం జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బస్వరాజ్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో అకాడమీని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అకాడమీలో బాలికలకు అండర్–15, 19, 23, సీనియర్, పురుషులకు అండర్–14 16, 19, 23, సీనియర్ విభాగాల్లో క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. అదేవిధంగా ఈ నెల చివర్లో ఇక్కడి మైదానంలో ఉత్తరాఖండ్– హెచ్సీఏ మహిళా జట్ల వన్డే ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ చక్కటి క్రికెట్ మైదానం రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, ఇక్కడి మైదానంలో బీసీసీఐ మ్యాచ్లు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, క్యూరెటర్ చంద్రశేఖర్, భార్గవ్, కోచ్లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్అలీ, సీనియర్ క్రీడాకారులు ఆబిద్ హుస్సేన్, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
9 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం
ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్లో రంగారెడ్డి జట్టు 9 వికెట్ల తేడాతో మెదక్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రంగారెడ్డి జట్టు 11.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి 132 పరుగులు చేసి గెలుపొందింది.
22 పరుగుల తేడాతో ఆదిలాబాద్
మరో లీగ్ మ్యాచ్లో ఆదిలాబాద్ జట్టు 22 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఆదిలాబాద్ జట్టు 22 పరుగుల తేడాలో హైదరాబాద్పై గెలుపొందింది.


