బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
మెట్టుగడ్డ: బీసీలకు న్యాయంగా దక్కాల్సిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి బీసీల ఆత్మగౌరవం పెంచేలా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో ఆదివారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పాలమూరు బీసీ సామాజిక న్యాయసభకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో 42 శాతం హామీ ఇచ్చి.. ఇప్పుడు కేంద్రానికి పంపాం అన్న నిర్లక్ష్య ధోరణి వీడకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో బీసీ సోదరులు రాజకీయంగా ఎంతో నష్టపోయారన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే భవిష్యత్ తరాలు మరింత నష్టపోతారన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు తమ వాటా దక్కే వరకు అన్ని బీసీ, కుల సంఘాలు ఏకమై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పాలమూరు సామాజిక న్యాయసభ స్ఫూర్తితో 2029లో బహుజన శక్తిగా మారుద్దామని పేర్కొన్నారు.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ బీసీల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తుంటే కేంద్రానికి పంపాం.. మా పనైపోయిందనే విధంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి బీసీల వైపు ఉంటారా.. బీజేపీ వైపు ఉంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మేధావులంతా మన బీసీలను చైతన్యపరచడంలో ముందువరుసలో ఉండాలని కోరారు. అనంతరం పాలమూరు సామాజిక న్యాయసభలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్, బీసీ జేఏసీ నాయకులు బాలరాజుగౌడ్, వేణుకుమార్,అం నారాయణగౌడ్, మాధ వ్, బెకెం జనార్దన్, శ్రీనివాస్సాగర్, లక్ష్మీకాంత్, రమేష్గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, వెంకటయ్య, నారాయణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


