ఎటు చూసినా డబ్బాలే!
నగర పరిధిలోని ఎన్హెచ్–167కు ఇరువైపులా ఏర్పాటు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఎక్కడ చూసినా ఇబ్బడిముబ్బడిగా డబ్బాలు వెలిశాయి. ముఖ్యంగా ఎన్హెచ్–167పై వందలాది డబ్బాలను కొందరు ప్రైవేట్ వ్యక్తులు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేసి ఇతరులకు కిరాయికి ఇస్తూ దండిగా సంపాదిస్తున్నారు. వాస్తవానికి ఏడాదిన్నర క్రితం వరకు తైబబజార్ అమలులో ఉండగా సదరు కాంట్రాక్టరు ప్రతి వీధి వ్యాపారి నుంచి రూ.30 నుంచి రూ.120 వరకు వసూలు చేసేవారు. రోడ్లపై తోపుడుబండ్లతో పాటు లోకల్ ట్రాన్స్పోర్ట్ (లోడింగ్, అన్లోడింగ్) వాహనాలు, ఆయా డబ్బాల్లో చిరు వ్యాపారుల నుంచి ముక్కుపిండి వసూలు చేసేవారు. అనంతరం దీనిని రద్దు చేయడంతో ఇదే అదనుగా భావించిన కొందరు వ్యక్తులు యథేచ్ఛగా డబ్బాలను ఏర్పాటు చేయసాగారు.
మెప్మా ఆధ్వర్యంలో మరికొన్ని..
సుమారు ఐదేళ్ల క్రితం మెప్మా ఆధ్వర్యంలో 123 డబ్బాలను నిర్మించి వీధి వ్యాపారుల కోసం కేటాయించారు. ఇందులో భాగంగా జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద 55, బాదం రామస్వామి గోల్డెన్ మున్సిపల్ ఆడిటోయం వద్ద 8, జీజీహెచ్కు ఎదురుగా 11, మెట్టుగడ్డ వద్ద 31, బండ్లగేరిచౌరస్తాలో 9, పాలకొండ డివిజన్ కార్యాలయం వద్ద 7, వేపురిగేరిలోని రెమానియా బ్రిడ్జి వద్ద 2 ఏర్పాటు చేశారు. అలాగే సుమారు ఏడాది క్రితం క్లాక్టవర్ వద్ద ఎమ్మెల్యే నిధులతో 18 డబ్బాలు (రేకుల షెడ్లు) నిర్మించారు. అయితే కొన్నిచోట్ల కేటాయించిన వారు వ్యాపారం నిర్వహించకుండా ఏకంగా ఇతరులకు కిరాయికి ఇచ్చేశారు. ఇలా ఒక్కో డబ్బా నుంచి రూ.మూడు వేల వరకు వసూలు చేస్తూ దండిగా సంపాదిస్తున్నారు.
● రూ.30 లక్షలు వెచ్చించి 2020లో పాన్చౌరస్తా సమీపంలోని మున్సిపల్ స్థలంలో జీ ప్లన్ వన్గా మహిళా సంఘ భవనం నిర్మించారు. పైన మహిళల కోసం పెద్ద హాలుతో పాటు కింద రెండు పెద్ద షాపు లు, మరో రెండు చిన్న షాపులు నిర్మించారు. అయి తే అప్పట్లోనే ఈ నాలుగు షాపులను రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఎలాంటి అద్దె లేకుండా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు చేజిక్కించుకున్నారు. ఇందులో ఒకరు మాజీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులే ఎంబ్రాయిడరీ, టైలరింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. మరో పెద్ద షాపు, చిన్నషాపును బంగారు నగలు తయారు చేసే ఇతరులకు అద్దెకు ఇచ్చినా మున్సిపల్ కార్పొరేషన్కు మాత్రం నయాపైసా చెల్లించకపోవడం గమనార్హం. మిగిలిన చిన్న షాపును వేరే మహిళ మగ్గం వర్క్ చేసేందుకు ఇతరులకు అద్దెకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంపై గతంలో పలుసార్లు మున్సిపల్ కౌన్సిల్లో కొందరు కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తెచ్చారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం అప్పటి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి ఈ షాపులను ఖాళీ చేయాలని బాధ్యులకు నోటీసులు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
ముఖ్య కూడళ్లు,ప్రధాన రహదారులే అడ్డా..
నగర పరిధిలో అప్పన్నపల్లి మొదలుకుని బండమీదిపల్లి వరకు ఎన్హెచ్–167 సుమారు 6 కి.మీ. విస్తరించింది. దీనికి ఇరువైపులా ముఖ్యకూడళ్లు, వ్యాపార సముదాయాల వద్ద కిక్కిరిసి రద్దీగా ఉండే ప్రాంతాల్లో డబ్బాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వన్టౌన్ నుంచి భూత్పూర్ రోడ్డు వెంట క్రిస్టియన్పల్లి వరకు, బోయపల్లిగేట్ మొదలుకుని నవాబ్పేట రోడ్డు వరకు, టీడీగుట్ట నుంచి కోయిల్కొండ ఎక్స్రోడ్డు వరకు, మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి రోడ్డు వరకు వందలాది ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వాటిలో కొందరు సొంతంగా వివిధ వ్యాపారాలు కొనసాగిస్తుండగా.. మరికొందరు దీనిని ఒక ఆదాయ వనరుగా మార్చుకుని ప్రభుత్వ స్థలంలో ఫుట్పాత్ను ఆనుకుని వేస్తుండటంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ స్థలమైనా మున్సిపల్ కార్పొరేషన్కు దక్కని ఆదాయం
మెప్మా ఆధ్వర్యంలో ఉన్నవి కేవలం 123 మాత్రమే
పాన్చౌరస్తా సమీపంలోని 4 షెట్టర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి..
ఏడాది క్రితమే బాధ్యులకు నోటీసులిచ్చినా ఖాళీ చేయని వైనం


