
వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అమరరాజా కంపెనీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మహబూబ్నగర్ నగర పరిధిలోని దివిటిపల్లి ఐటీ పార్క్లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ యువతకు మూడు నెలలపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తారన్నారు. కేవలం అమరరాజా కంపెనీ కోసమే కాకుండా అభ్యర్థులు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. మహబూబ్నగర్ను విద్య, వైద్య, రవాణా రంగాల్లో అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఇంజినీరింగ్, లా, ఐఐఐటీ కళాశాలలను మంజూరు చేశారన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహకారంతో మహిళలకు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రానున్న పదేళ్లలో కనీసం 20 వేల మంది యువత నైపుణ్య శిక్షణ పొందేలా యత్నిస్తున్నామన్నారు. అనంతరం శిక్షణ పొందే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ జయకృష్ణ, ఓఎస్ఎస్ఐ సీఈఓ సలీంఅహ్మద్, నాయకులు సిరాజ్ఖాద్రీ, అజ్మత్అలీ, అవేజ్, హన్మంతు, శివశంకర్, రాషెద్ఖాన్, ఖాజాపాషా, శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి