కురుమూర్తిలో అమావాస్య పూజలు
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి దర్శనానికి అమావాస్యను పురస్కరించుకొని మంగళవారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం నుంచే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగించి గోవింద నామస్మరణ చేశారు. మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపాలను భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో స్వీట్లు ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.
కురుమూర్తిలో అమావాస్య పూజలు


