మన స్నేహం మరణంలో కూడ.. మిత్రమా..! | - | Sakshi
Sakshi News home page

మన స్నేహం మరణంలో కూడ.. మిత్రమా..!

Oct 18 2023 1:12 AM | Updated on Oct 18 2023 3:25 PM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి మృత్యుఒడికి చేరారు. స్కూటీని కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లా గుడిగండ్లలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన ఉదయ్‌కుమార్‌(28) ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అంబర్‌పేటకు చెందిన అఖిల్‌ (26)తో పరిచయం ఏర్పడింది.

అఖిల్‌ ఐటీఐ ఫెయిల్‌ అయ్యి ఖాళీగా ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి ఉదయ్‌కుమార్‌, అఖిల్‌ ఇద్దరు కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా స్కూటీపై హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మక్తల్‌ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గుడిగండ్ల దగ్గర రాయచూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న కర్ణాటక బస్సు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఉదయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. అఖిల్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన స్థానికులు వెంటనే 108లో అఖిల్‌ను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం సమాచారం అందుకున్న ఎస్‌ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఉదయ్‌కుమార్‌ మృతదేహాన్ని మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అఖిల్‌ తల్లి ఉమ, ఉదయ్‌కుమార్‌ తండ్రి మహేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement