తల్లీ.. చల్లంగ చూడు అంటూ..తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.. శ్రావణమాసం నేపథ్యంలో బుధవారం గ్రామంలో డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ మహిళలు బోనాలతో బయల్దేరి వెళ్లి ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.
– తొర్రూరు రూరల్
జ్వరంతో నాలుగేళ్ల బాలుడి మృతి
కేసముద్రం: జ్వరంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ ముప్ప శ్రీకాంత్, ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు నయాన్ష్(4)కు వారం రోజుల క్రితం జ్వరం సోకింది. ఈ నెల 17న మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆ బాలుడిని ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు మళ్లీ జ్వరం పెరగడంతోపాటు ఫిట్స్ రావడంతో మంగళవారం (ఈనెల 18న) ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో 15రోజుల్లో బాలుడు నయాన్ష్ పుట్టినరోజు ఉండడంతో అదితలచుకుని తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్ని కలచివేసింది.


