భార్య మృతితో తల్లడిల్లి
భర్త కన్నుమూత
రఘునాథపల్లి : ఆ దంపతులు వృద్యాప్యం వరకూ అన్యోన్యంగా జీవించారు. చివరికి మరణంలోనూ విడిపోలేదు. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో బుధవారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రాసమల్ల అయిలయ్య (85), రామక్క (80) దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా రామక్క అనారోగ్యంతో బాధపడుతుండగా భర్తే సపర్యాలు చేస్తుండేవారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రామక్క మరణించింది. బుధవారం మధ్యాహ్నం దహనసంస్కారాలు నిర్వహిస్తుండగా భార్య మృతితో తల్లడిల్లిన అయిలయ్య మనస్తాపంతో కన్నుమూశాడు. రామక్క దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాత్రి అయిలయ్య అంత్యక్రియలు నిర్వహించారు. గంటల వ్యవధిలోనే దంపతులు చనిపోవడం, ఇద్దరి దహన సంస్కారాలు ఒకే రోజు నిర్వహించాల్సి రావడంతో కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఒక రోజు వ్యవధిలో దంపతుల మృతి
వెల్దిలో విషాదఛాయలు


