శాయంపేట : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు వలకు చిక్కుకొని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఎస్సై జక్కుల పరమేష్ కథనం ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పల్లెబోయిన భిక్షపతి (45) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చేపలు పట్టేందుకు మండలంలోని జోగంపల్లి శివారులో చలివాగు ప్రాజెక్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలో ఉన్న చేపలు తీస్తుండగా ప్రమాదవశాత్తు భిక్షపతి కాళ్లు, చేతులు వలలో చిక్కుకోగా మృతిచెందాడు. తెల్లవారిన కూడా భిక్షపతి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు, తోటివారు చలివాగు వద్దకు వెళ్లి వెతకగా వలలో చిక్కుకొని భిక్షపతి మృతి చెంది కనిపించాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి..
ఖిలా వరంగల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నపేట రఘునాథ్కాలనీకి చెందిన బుర్ర సంపత్ (57) సోమవారం ఉదయం వరంగల్ ఫోర్ట్రోడ్డులో నడుచుకుంటూ రంగశాయిపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్ నుంచి రంగశాయిపేట వైపు అతివేగంగా వెళ్తున్న కారు సంపత్ను బలంగా ఢీకొట్టింది. దీంతో సంపత్ తీవ్రంగా గాయపడగా స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు.
విద్యుదాఘాతంతో మహిళ..
జనగామ రూరల్ : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని ఎర్రగొల్లపహాడ్ అజ్మీరా తండాలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా ముత్యాలమ్మ (60) సోమవారం తన వ్యవసాయ భూమి వద్ద జరిగిన విద్యుత్ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.


