మరిపెడ రూరల్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆనెపురం స్టేజీ సమీపంలో కుడియా తండా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మరిపెడ మండలంలోని స్టేజీతండా గ్రామ పంచాయతీ పరిధిలోని కుడియా తండాకు చెందిన అజ్మీరా సుశీల (50) ఆదివారం రాత్రి రోడ్డు వెంట నడుచుకుంటు వెళ్తోంది. ఈ క్రమంలో వరంగల్ వైపు వెళ్తున్న పాల వ్యాన్ ఒక్కసారిగా ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుశీలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మహిళను ఢీకొట్టిన పాల వ్యాన్ వెనకాల వేగంగా వస్తున్న మరో లారీ అదుపు తప్పి పాల వ్యాన్ను ఢీకొట్టింది. అంతే వేగంతో లారీ అదుపు తప్పి రహదారికి కుడి వైపునకు దూసుకెళ్లింది. అక్కడ ఓ ఇంటి ఎదుట నిలిపిన కారు, ఆటోను ఢీకొట్టడంతో పాటు భారీ చెట్టు పెకిలించి పడేసింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ ప్రభాకర్రావు, క్లీనర్ తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన అజ్మీరా సుశీలకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఇలా 563 జాతీయ రహదారిపై రాత్రివేళ క్షణాల్లో జరిగిన పెను ప్రమాదం తండా వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
ప్రమాదంలో మహిళ దుర్మరణం
లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు


