ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద చేపట్టిన తుది దశ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మేడారంలో సీఎం పర్యటన ఏర్పాట్లతో పాటు ఆలయ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతన క్యూ లైన్ స్థలాన్ని పరిశీలించి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో భాగంగా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ముందుగా మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, డీపీఓ వెంకయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఈఓ వీరస్వామి, సర్పంచ్ భారతి పాల్గొన్నారు.
మంత్రి సీతక్క


