● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ
మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. భారతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు ఉమ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కంకర అయ్యప్పరెడ్డి హాజరై మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాబోయే ఎన్నికల్లో రాహుల్గాంధీని ప్రధాని చేయడమే ముఖ్య ఉద్దేశంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేయడానికి, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి యువజన కాంగ్రెస్ ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటినుంచి దేశంలో అనేక సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తూ యువజన కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద యువజన సంఘంగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు గార్లపాటి సాయితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉబ్బపల్లి శ్రావణ్, గూడూరు, నెల్లికుదురు మండలాల, కేసముద్రం టౌన్ అధ్యక్షులు బొల్లికొండ మధు, మద్ది రాజేష్, ఎండి.రియాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, శ్యామ్, నునావత్ రాజేష్, వేల్పుల శేఖర్, సాత్విక్, హరికిషన్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


