కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు హిందూ, ముస్లిం మతసామరస్యానికి, సోదరభావానికి ప్రపంచ ప్రసిద్ధిగాంచాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కాజీపేట దర్గాలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్, ట్రాఫిక్, పారిశద్ధ్యం, వైద్య, పోలీస్ తదితర అధికారులతో కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తి, శాంతితో ఉత్సవాలు నిర్వహించాలని ఆయన కోరారు. దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చొరవతో ఈ ఏడాది దర్గాలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు, రూ.40 లక్షలతో మంచి నీటి పనులు, రహదారి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 30 వేల మంది భక్తులకు బోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. మానవత్వం కోసం అనే అంశంపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, ఇందులో పంజాబ్, ఉత్తరప్రదేశ్ లక్నోతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సూఫీ ప్రముఖులు హాజరుకానున్నారని, హిందూ ఆలయ పూజరులు, బ్రహ్మణులు, ఉలమాలు, ముషాయిఖ్లు పాల్గొని శాంతి సందేశాన్నిస్తారని తెలిపారు. సోమవారం ఉర్సు ఉత్సవాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీ న్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు రానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో దర్గా ఉపపీఠాధిపతి భక్తియార్బియాబానీ, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, సింగారపు రవిప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
● పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్రెడ్డి
● నేటినుంచి దర్గా ఉత్సవాలు ప్రారంభం


