కేయూ క్యాంపస్: విద్యార్థులు, ఉద్యోగులు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ యూనిట్లో స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం కోరారు. శనివారం కేయూ ఆడిటోరియంలో రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రెడ్క్రాస్ సొసైటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు, ఉద్యోగులు కలిసి సుమారు 1000 మంది సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గతంలోనే కేయూ ఎన్ఎస్ఎస్కు ఇండియన్ రెడ్క్రాస్ సేవా సర్టిఫికెట్ లభించిందని గుర్తుచేశారు. ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ యుద్ధాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుండి సహాయక చర్యలు చేపడుతుందని వివరించారు. అరుదైన రక్తగ్రూపు దాతల వివరాలను డేటాబేస్ రూపంలో సేకరించి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా ఈ బ్రాంచ్ పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి లైఫ్ అసోసియేట్గా, ఇతరులు లైఫ్ మెంబర్గా సభ్యత్వం పొందాలని సూచించారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, రెడ్క్రాస్ సొసైటీ యూనిట్ నోడల్ అధికారి ఈసం నారాయణ, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, బీసీ సెల్ డైరెక్టర్ బి.సతీశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారి ఈసం నారాయణకు సభ్యత్వ దరఖాస్తు, నిర్ణీత రుసుము చెల్లించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ తొలి లైఫ్ మెంబర్గా సభ్యత్వం తీసుకున్నారు.
కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం


