‘యూత్ మీటప్ విత్’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హన్మకొండ: వరంగల్లో జెన్జీ మూవ్మెంట్ తీసుకొద్దామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం యూత్ మీటప్ విత్ తీన్మార్ మల్లన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెన్జీ యువత తలుచుకుంటే రాజకీయాల్లో అనేక మార్పులు సాధ్యమవుతాయన్నారు. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించాలనే డిమాండ్ వస్తోందని, అయితే దీనికి ముందు కులాన్ని తీసివేయాలని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదని, తాను బీసీలకు రాజ్యాధికారం సాధించే దిశగా పాటుపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కులగణనను వ్యతిరేకించినందుకు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరానికి మళ్లిస్తే, సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేయూ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించానని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయానన్నారు. గతంలో ఎమ్మెల్సీలకు ఉన్న అభివృద్ధి నిధులను సీఎంగా రేవంత్ వచ్చాక లేకుండా చేశారని విమర్శించారు. అనంతరం విద్యార్థులు, యువత అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.


