జనగామ: జనగామ మండలం చీటకోడూరు, వడ్లకొండ గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్కు పంపినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణ పోలీస్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. చీటకోడూరు సర్పంచ్ కుకట్ల యాదగిరితోపాటు గ్రామానికి చెందిన మరో 44 మంది రైతులు, వడ్లకొండకు చెందిన 10 మంది రైతుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మధ్యాహ్నం వడ్లకొండ క్రాస్రోడ్ వద్ద ఎస్ఐ భరత్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశా రాష్ట్రంలోని కలహాండి జిల్లా ధర్మగర్ గ్రామానికి చెందిన రసిక్ మజ్హి, బింబదర్ పాత్ర, జాడు మజ్హి ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. దీంతో వారు రైతుల వ్యవసాయ పొలాల వద్ద బోర్లు, మోటార్ల వైర్లు, సర్వీస్ వైర్లు, కేబుల్ వైర్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.80 వేల నగదు, పనిముట్లు, పరికరాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. రైతుల ఫిర్యాదులపై పోలీసులు వేగంగా స్పందించి, శాసీ్త్రయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో దర్యాప్తు చేపట్టడం వల్ల నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడం సాధ్యమైందని సీఐ సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అపరిచిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కేసు చేదనలో సీఐ పర్యవేక్షణలో ఎస్ఐలు భరత్, రతీష్, హెడ్ కాని స్టేబుల్ నాసర్, మహిళా పోలీసు కానిస్టేబుల్ మనీషా, పోలీసు కానిస్టేబుళ్లు కరుణాకర్, కృష్ణ, భాస్కర్, సాగర్, ఐడీ అసిస్టెంట్ సల్మాన్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
రూ.80 వేల నగదు, పరికరాలు స్వాధీనం


