వరంగల్ జిల్లా సంగెం మండలంలో, పర్వతగిరి మండలంలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తిమ్మాపూర్లో..
సంగెం : ద్విచక్రవాహనం ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీ కొట్టడంతో మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తబ్బెట ఎల్లస్వామి(56) గురువారం రాత్రి ఇంటి సమీపంలోని కిరాణాషాపునకు వెళ్లి వస్తున్నాడు. అదేసమయంలో అదే గ్రామానికి చెందిన తాటికొండ మణికంఠ స్కూటీపై అతివేగంగా అజాగ్రత్త వస్తూ ఎల్లస్వామిని ఢీ కొట్టాడు. దీంతో రోడ్డుపై పడడంతో ఎల్లస్వామి తల, మెడ, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. అతన్ని వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతుడికి భార్య సుధ, ఇద్దరు కుమారులు రాజు, యాదగిరి ఉన్నారు. పెద్ద కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
విద్యుదాఘాతంతో మహిళ..
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం గ్రామంలో మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ సలీమా(35) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద విద్యుత్ హీటర్ను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.


