న్యూస్రీల్
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో కాంగెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక ఎట్టకేలకు పూర్తయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ శుక్రవారం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, పట్టణాల అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు.
మూడు నెలలుగా తర్జనభర్జన..
జిల్లాలోని 18 మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపికపై మూడు నెలలుగా నాయకుల మధ్య తర్జనభర్జన కొనసాగింది. జిల్లాలో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నా యి. ములుగు, ఇల్లెందు, పారికుర్తి నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మండలాలకు ఒక్కరి పేరు, మరికొన్ని మండలాలకు ఇద్దరి నుంచి ఐదుగురు పేర్లు ప్రతిపాదించినట్లు ప్రచారం. ఇలా జిల్లాలోని 18 మండలాలకు మొత్తం 50మందికి పైగా నాయకుల పేర్లు రాసి పంపించారు. అయితే ఎంపిక విషయంలో ఎంత మంది అబ్జర్వర్లు వచ్చినా.. ఎంత మంది నాయకులు ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్. కాగా, ఎమ్మెల్యేలు చూసించిన నాయకులపై మరికొందరు అభ్యంతరాలు చెప్పారు. మరికొన్నిచోట్ల ఎంపీ బలరాంనాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మరికొన్ని మండలాల్లో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మండల అధ్యక్షుల ఎంపిక కోసం కొందరి పేర్లు సిఫారసు చేసినట్లు ప్రచారం జరిగింది. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గంగారం మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూ రు, పెద్దవంగర మండలాల్లో ఏకాభిప్రాయంతో.. ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రతిపాదించిన నాయకులపై కొందరు కార్యకర్తలు తెలిపిన అభ్యంతరాలపై చర్చ జరిగింది. అయితే తర్వాత సర్దిచెప్పి ఆరు మండలాల ఎంపిక పూర్తి చేశారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మండల అధ్యక్షుల ఎంపికపై ఉన్న చిక్కుముడి వీడలేదు. దీంతో జాబితా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ వద్దకు చేరిందనే వార్తలు వచ్చాయి.
బుజ్జగింపులు..
మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని మండలాల అధ్యక్ష పదవులు అశిస్తున్న వారిలో ఎమ్మెల్యే కొందరి పేర్లు సూచించగా.. ఎంపీలు, ఇతర పార్టీ పెద్దల మరికొందరి పేర్లు చెప్పి పట్టుబట్టారు. దీనిపై ఎమ్మెల్యే, ఇతర నాయకుల సమాలోచనకు వచ్చి జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. అయితే పదవి ఆశించిన వారిని బుజ్జగించడం, మరో అవకాశం ఇస్తామని చెప్పడం, పీఏసీఎస్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. ఏదీ ఏమైనా ఎట్టకేలకు పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది.
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక
వర్గాల మధ్య కుదిరిన సయోధ్య
పోటీ ఎక్కువగా ఉన్న చోట సమన్వయం
మరో అవకాశం ఇస్తామని బుజ్జగింపులు
కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరే..
నియోజకవర్గం మండలం అధ్యక్షుడు
మహబూబాబాద్ మహబూబాబాద్ బెల్లంకొండ శ్రీనివాస్
గూడూరు దారావత్ బాలాజీ
కేసముద్రం చిలువేరు సమ్మి
ఇనుగుర్తి బైరు అశోక్ గౌడ్
నెల్లికుదురు ఎదళ్ల యాదవ రెడ్డి
డోర్నకల్ దంతాలపల్లి కొడుపుగంటి హరికృష్ణ
నర్సింహులపేట బొబ్బ సోమిరెడ్డి
కురవి బలగాని శ్రీనివాస్ గౌడ్
డోర్నకల్ బత్తుల శ్రీనివాస్
సీరోలు బుడిగం లక్ష్మీనారాయణ
చిన్నగూడూరు మారబోయిన వెంకటేశ్వర్లు
మరిపెడ గుగులోత్ రవినాయక్
మరిపెడ పట్టణం బానోత్ రాంలాల్
డోర్నకల్ పట్టణం కాల సుమీర్ జైన్


