● ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రు నాయక్
కురవి: సర్పంచ్లకు అధికారులు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ వీరబాబు అధ్యక్షతన జరిగింది. అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలేదని సభలో సర్పంచ్లు ఏకరువు పెట్టారు. ప్రతీ గ్రామంలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఏఈ శారద పట్టించుకోవడంలేదని, ఫోన్ చేసినా ఎత్తడంలేదని సర్పంచ్లు మండిపడ్డారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్పంచ్ల ఫోన్ ఎత్తకుండా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఏడీఈ రమేష్ సభకు వచ్చి సర్పంచ్లు తెలిపే ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్లు శాంతించారు. కరెంట్ బిల్లులు చెల్లించాలని ఎంపీడీఓ, ఎంపీఓలు అడుగుతున్నారని సర్పంచ్లు ఆరోపించారు. 17 మంది బీఆర్ఎస్ సర్పంచ్లపై వివక్ష చూపుతున్నారని, ఈజీఎస్ పనులు రాకుండా చేశారని బీఆర్ఎస్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని నాన్ స్టార్ట్ ఇందిరమ్మ ఇళ్లను ఇంత వరకు క్లియర్ చేయలేదని, ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎంపీడీఓ వీరబాబుపై మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితా పూర్తి చేస్తానని ఎంపీడీఓ తెలిపారు. అధికారులు సర్పంచ్లకు సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో భగీరథ నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వేసవిలో ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ వీరబాబు, తహసీల్దార్ విజయ, డీఈ జుంకీలాల్, చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, గార్లపాటి వెంకటరెడ్డి, కొర్ను రవీందర్రెడ్డి పాల్గొన్నారు.


