మార్కెట్‌ చరిత్రలో మక్కలకు రికార్డు ధర | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ చరిత్రలో మక్కలకు రికార్డు ధర

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

రూ.2,629 పలికిన పంట

కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా మక్కలకు మార్కెట్‌ చరిత్రలోనే రికార్డు ధర పలికింది. మక్కల సీజన్‌ ప్రారంభంలో క్వింటాకు ధర రూ.1,500 నుంచి 1,900 వరకు మాత్రమే పలికింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మద్దతు ధర రూ.2,400కు మించి పలుకుతూ వస్తుంది. కాగా, గురువారం మార్కెట్‌కు 55 బస్తాల మక్కలు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.2,629, కనిష్ట ధర రూ.2,400 పలికినట్లు అధికారులు తెలిపారు. కేసముద్రం మార్కెట్‌ చరిత్రలోనే మొదటిసారి మక్కలకు రూ.2,629 పలికినట్లు తెలిపారు.

మార్కెట్‌కు వరుస సెలవులు

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 8,9,10 తేదీల్లో వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 వారాంతపు సెలవు, 10 (సోమవారం) బోనాల పండుగకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో మా ర్కెట్‌కు వరుసగా మూడురోజులు సెలవు ఉంటుందన్నారు. తిరిగి 11న పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. సెలవుల్లో మార్కెట్‌కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దన్నారు.

బావిలో పడి రైతు మృతి

కొత్తపేటలో ఘటన

బయ్యారం: వ్యవసాయ బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింత సైదులు (50) ఉదయం తన వ్యవసాయ బావికి విద్యుత్‌ మోటారు, పైపులు బిగించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. బావి వద్ద మోటారు బిగించి పైపులు సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. మృతుడి అల్లుడు సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. ప్రశాంత్‌బాబు తెలిపారు

గుండెపోటుతో

ఆర్టీసీ ఉద్యోగి..

తొర్రూరు: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తొర్రూరుకు చెందిన రెడ్డబోయిన వెంకటనారాయణ(55) స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్‌డీఐ(స్పెషల్‌ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌)గా పని చేస్తున్నాడు. రోజుమాదిరిగానే విధుల్లో ఉన్న వెంకటనారాయణకు చాతిలో నొప్పిగా అనిపించడంతో సహచరులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఉపేంద్ర, కుమారుడు మణిదీప్‌, కుమార్తె మానస ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement