రఘునాథపల్లి: గోల్డ్చైన్ చోరీ చేసిన మహిళను రఘునాథపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన గుడి ప్రమీల ఇంట్లోకి గతనెల 23న తాళ్లమూడి శైలజ వచ్చింది. మాయమాటలతో అక్కడే బసచేసి తెల్లవారుజామున తులం బంగారు గొలుసుతో శైలజ పరారైంది. బుధవారం రఘునాథపల్లి బస్టాండ్ సమీపంలో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని గోల్డ్ చైన్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇవే తరహా నేరాలకు ఆమె పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం జనగామ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో ఆమెను నర్సంపేట జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పుస్తెలతాడు చోరీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 13వార్డుకు చెందిన ఎంపెల్లి సరోజన మెడలో బంగారం పుస్తెలతాడును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇంటి వద్ద వరండాలో నిద్రిస్తుండగా మెడలో నుంచి 3.15 తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.


