హన్మకొండ : అంగన్ వాడీ కేంద్రాల విద్యుద్దీకరణ పనులు ఈ నెల 10వ తేదీలోపు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(వీసీ)లో హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్ వి.మోహన్ రావు, చీఫ్ ఇంజినీర్ సురేందర్, ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ, ఖమ్మం, ములుగు, రాజన్న సిరిసిల్ల సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, కన్స్ట్రక్షన్ డీఈలు, ఉద్యోగులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించే పనుల పురోగతిపై ఈ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో ఇంకా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ, ఖమ్మం, ములుగు, రాజన్న సిరిసిల్ల సర్కిళ్లలోని అంగన్వాడీ కేంద్రాల విద్యుద్దీకరణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుద్దీకరణ పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేస్తామన్నారు.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
డైరెక్టర్ శ్రుతి ఓజా


