కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం బర్న్స్ వార్డులో ఓ బాధితుడు చల్లదనం కోసం మొరపెట్టుకుంటున్నా డు. ‘కాలిన బొబ్బలతో ఉన్న నా శరీరం మండుతుంది. సల్లగాలి తగులక సల సల కాగినట్లుంది. సార్లు... జెరా చల్లగాలి వచ్చేటట్లు చేయండి’ అంటూ వేడుకుంటున్నాడు. మంగళవారం రాత్రి కాజీపేట మండలం అమ్మవారిపేటలో ఉర్సు కరీమాబాద్కు చెందిన మెరుగు పవన్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని తీవ్రమైన కాలిన గాయాలకు గురికాగా ఎంజీఎం బర్న్స్ వార్డుకు తరలించారు. అయితే రాత్రి నుంచి మరుసటి రోజు వరకు వైద్యులు చికిత్స చేస్తున్నప్పటికీ శరీరంపై ఉపశమనం కోసం ఏసీలు పనిచేయకపోవడంతో కాలిన గాయాల మంటను తట్టుకోలేకపోయాడని బాధితుడి మిత్రులు తెలిపారు. బుధవారం బాధితుడి బాధ చూడలేక కుటుంబీకులు ఇంటి వద్ద నుంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి కాస్తంతా ఊరట కలిగించారని పేర్కొన్నారు. అయితే దాదాపు నెలరోజుల పైనుంచి వార్డులో ఏసీలు పనిచేయడం లేదని తెలుస్తోంది.
ఎంజీఎం బర్న్స్ వార్డులో
ఓ బాధితుడి మొర
వార్డులో ఏసీలు పనిచేయక..
టేబుల్ ఫ్యాన్తో ఊరట


