జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న ఓ మహిళపై భారీ కొండ చిలువ బుధవారం దాడికి పాల్పడింది. అప్రమత్తతతో వ్యవహరించిన మహిళ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు గ్రామస్తులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన స్వప్న తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న చేనులో పని చేస్తుండగా అక్కడ దాక్కున్న సుమారు 12 అడుగులకు పైగా పొడవున్న భారీ కొండ చిలువ ఒక్కసారిగా ఆమెను నోటితో కరిచింది. ఈ ఘటనతో షాక్కు గురైన స్వప్న ధైర్యం కోల్పోకుండా పాము నుంచి తప్పించుకుని కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అరుపులు విన్న సమీప రైతులు, కుటుంబీకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం కొండ చిలువను చంపి సంచిలో వేసుకుని, గాయపడిన స్వప్నతో కలిసి జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్ కల్నల్ భిక్షపతి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం స్వప్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని ఆయన తెలిపారు.
మొక్కజొన్న చేనులో
పని చేస్తుండగా ఘటన


