● డీఎంహెచ్ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మండల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గూడూరు, కోమట్లగూడెం, కొత్తగూడ, తీగలవేణి, గంగారం పీహెచ్సీల్లో 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సీజనల్ వ్యాధులు ప్రారంభమవుతున్న నేపధ్యంలో విషజ్వరాలు, పాముకాటు, తేలుకాటు మందులు అందుబాటులో ఉన్నాయని, డెంగీ, మలేరియా, జ్వరాల వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తల్లిపాల ప్రాముఖ్యాన్ని వివరించాలన్నారు. విషజ్వరాలను నివారించేందుకు ఇంటింటి సర్వే, డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జీపీ సిబ్బందితో కలిసి పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో పోగ్రాం అఽధికారి శివకుమార్, డెమో రాజ్కుమార్, స్వామి, పీహెచ్సీల అధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.
ఏజెన్సీ పీహెచ్సీల్లో 24గంటల వైద్యసేవలు
గంగారం: ఏజెన్సీ మండలమైన గంగారం మండలంలోని గంగారం, కోమట్లగూడెం పీహెచ్సీలకు 24గంటల వైద్యసేవలు అందించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి బి. రవి రాథోడ్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీంతో ఆయా పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.


