● ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి
హన్మకొండ: గ్రేటర్ వరంగల్ పరిధికి పీఎం ఈ–బస్ సేవలో భాగంగా 100 విద్యుత్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తెలిపారు. వరంగల్ రిజియన్ తనిఖీలో భాగంగా మంగళవారం ఆయన నగర పరిధిలోని వివిధ డిపోలను పరిశీలించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్త బస్సులను హనుమకొండ డిపోతో పాటు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో నూతనంగా నిర్మించనున్న డిపోకు కెటాయించనున్నట్లు వివరించారు. 100 బస్సులు ఒకే డిపో ద్వారా నడుపడం సాధ్యం కాదని, రెండు డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుతోపాటు ఈ మేరకు అభివృద్ధి చేస్తామన్నారు. ఎయిర్ పోర్టు సమీపంలో ఆర్టీసీకి స్థలం లేదని, మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం, లేదా ఎయిర్ పోర్టు అథారిటీ వారు కెటాయిస్తే పరిశీలిస్తామన్నారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నిర్మాణ సమయంలో ఎత్తు పెంచితే బాగుండేదన్నారు. వరద నీటి నిలువ సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీనికి ప్రతిపాదనలు రూపొందించామని, టెండర్లు పూర్తయ్యాయన్నారు. మొత్తానికి ఖర్చు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు.


